దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : త్వరలో తెలంగాణాలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన సిట్టింగ్ ల స్థానంలో మార్పులు ఉంటాయని ఇప్పటికే పలు వార్తా కథనాలు ప్రచురితమయ్యాయి. అయినప్పటికీ, ప్రభుత్వం నుండి ఈమేరకు అధికారిక ప్రకటన రాలేదు. అలాగే కాంగ్రెస్ పార్టీకి చెందిన అభ్యర్థుల అసెంబ్లీ టికెట్ల పై సైతం గత నెల రోజులుగా ఎన్నో ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కాగా, అధికార పార్టీ ప్రకటించే అభ్యర్థుల జాబితాను బట్టి కాంగ్రెస్, బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించే విధంగా వ్యూహాత్మక ఎత్తుగలలో భాగంగా వేచి చూస్తోంది.
Also Read : ఎన్నికల సీజన్ వ్యాపారులతో కాంగ్రెస్ కు నష్టం - వ్యాసం @DhivitiNews.com
అయితే, తీన్మార్ మల్లన్న నేతృత్వంలో నిర్వహించబడుతున్న సంచలన యూట్యూబ్ ఛానల్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఖాయమైన భారాస, కాంగ్రెస్ అభ్యర్థుల జాబితాను చేజిక్కించుకొని, "విశ్వసనీయ సమాచారం మేరకు" అనే టాగ్ లైన్ తో ఆయా పార్టీల ఖాయమైన అభ్యర్థుల జాబితాలు తమ ట్విట్టర్ వేదికగా ఆదివారం లీక్ చేసి సంచలనం సృష్టించింది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా భారాస, కాంగ్రెస్ అభ్యర్థుల లిస్ట్ గురించి కాస్త పక్కన పెడితే, మహబూబాబాద్ జిల్లాలోని రెండు నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు సంబంధించి Q న్యూస్ నెట్వర్క్ లీక్ చేసిన జాబితాలో ఆశ్చర్యానికి గురయ్యే అభ్యర్థికి అవకాశాలున్నట్టు తెలిపింది. అదేంటంటే జిల్లాలోని మహబూబాబాద్ నియోజకవర్గంలో మాజీ కేంద్ర మంత్రి పోరిక బలరాం నాయక్ కు లేదా బిజెపికి చెందిన రాష్ట్ర నాయకులు జాటోత్ హుస్సేన్ నాయక్ కు ఎమ్మెల్యే టికెట్ అందనుందని తెలిపింది. హుస్సేన్ నాయక్ గత కొద్ది కాలంగా బిజెపి కార్యకర్తలకు కాస్త దూరంగా ఉంటూ వస్తున్నారని, పార్టీ మారే అవకాశాలు ఉన్నాయని ఆరోపణలు వినిపిస్తున్నవేళా Q న్యూస్ నెట్వర్క్ ఇలాంటి లీక్ చేయడం సంచలనంగా మారింది. ఇక డోర్నకల్ నియోజకవర్గానికి సంబంధించి అందరూ ఊహించినట్లుగానే డా. రామచంద్రు నాయక్ కె టికెట్ కాయం చేసినట్లు Q న్యూస్ నెట్వర్క్ లీక్ చేసిన జాబితాలో స్పష్టం చేయబడి ఉంది.
ఏది ఏమైనప్పటికీ, Q న్యూస్ నెట్వర్క్ లీక్ చేసిన అభ్యర్థుల జాభితా విశ్వసనీయత ఎంతమేరకు ఉంటుందో తెలియదుగానీ, మహబూబాబాద్ జిల్లా రాజకీయాల్లో ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు ఈ సమాచారం ఊతమిచ్చిందనే చెప్పవచ్చు.
Admin
Dhiviti News