దివిటీ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ : ప్రముఖ పారిశ్రామిక, వ్యాపారవేత్త, కిసాన్ పరివార్ అధినేత నానావత్ భూపాల్ నాయక్ రాజకీయరంగ ప్రవేశం చేస్తున్నట్టు, మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ టికెట్ తనకే వస్తుందని ప్రకటించడంతో డోర్నకల్ నియోజకవర్గంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలతోపాటు ఆ నియోజకవర్గ భారాస నాయకులు సైతం భూపాల్ నాయక్ పై ఓ కన్నేసి ఉంచారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో భూపాల్ నాయక్ పర్యటనలను అడ్డుకోవాలని, ఆయనకు వ్యతిరేకంగా క్యాంపెయిన్ మొదలు పెట్టాలనే ఆలోచనలో అయన వ్యతిరేక వర్గం ఇప్పటికే వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. దీనికి బలం చేకూర్చేలా.. భూపాల్ రాజకీయరంగ ప్రవేశ ప్రకటన చేసిన వెంటనే ఆయన గతంలో ఓ పబ్బులో వినోద కార్యక్రమంలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టడం విశేషం. ఈ చర్యతో భూపాల్ నాయక్ పరువు పోయేలా ఆయన రాజకీయాలకు అనర్హుడు అనే మెసేజ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకుపోయేలా ఆయన వ్యతిరేక వర్గం ప్రయత్నించినట్టు కాంగ్రెస్ పార్టీ లోని ఓ వర్గం తెలుపుతోంది.
Also Read : Q న్యూస్ లీక్.. ముందే చెప్పిన దివిటీ.. జిల్లా బిఆర్ఎస్ అభ్యర్థులు వీరే..!! @DhivitiNews.com
కాగా, ఆదివారం రోజు మహబూబాబాద్ జిల్లా చిన్న గూడూరు మండల కేంద్రంలో డోర్నకల్ నియోజకవర్గ అభివృద్ధి విధివిధానాలపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించ తలపెట్టిన రౌండ్ టేబుల్ సమావేశానికి భూపాల్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సి ఉండగా భూపాల్ రాకను ముందే పసిగట్టిన వ్యతిరేక వర్గం చిన్న గూడూరులో భూపాల్ నాయక్ వాహనాల కాన్వాయిని అడ్డుకుంటూ "గో బ్యాక్ భూపాల్ నాయక్" అంటూ నినాదాలు చేసి సమావేశానికి భూపాల్ హాజరు కాకుండా ధర్నాకు దిగారు. ఓ స్థాయిలో భూపాల్ నాయక్ పై దాడికి సైతం వారు తెగించడం గమనార్హం. ఈ క్యాంపెయిన్ లో కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గంతోపాటు లంబాడి హక్కుల పోరాట సమితి (ఎల్.హెచ్.పి.ఎస్) లోని ఓ వర్గం నేతలు పాల్గొనడం గమనించదగ్గ విషయం. కాగా తాను రాజకీయాలలో ఉన్నా లేకున్నా డోర్నకల్ నియోజకవర్గ ప్రజల జీవన స్థితిగతులను మార్చడం, అభివృద్ధి దిశగా నడిపించడమే తన ముఖ్య ఉద్దేశమని, అందుకు తాను నడుపుతున్న కిసాన్ పరివార్ ద్వారా యువతకు ఉద్యోగాలు ఇవ్వడం, రైతుల అభివృద్ధికి పాటుపడడం జరుగుతోందని, ఇందుకోసం ఇప్పటికే 5 నుండి 6 కోట్ల రూపాయలు వెచ్చించానని, మునుముందు మరెంతో చేయాల్సి ఉందని, తనపై వ్యతిరేక ప్రదర్శనలు చేస్తున్నవారు సామాన్య ప్రజలు కారని, రాజకీయాలలో తన ఎదుగుదలను ఓర్వలేని ఓ వర్గం నాయకులే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు.
ప్రేక్షక పాత్ర పోషిచిన పోలీసులు.. ఆదివారం భూపాల్ కు వ్యతిరేకంగా జరిగిన ధర్నాలో ఆ ధర్నాను నిర్వహించిన నాయకులు ఓ సమయంలో భూపాల్ నాయక్ పై దాడికి సైతం ప్రయత్నించడం, వారి "గో బ్యాక్" నినాదాన్ని గౌరవించి వెనుదిరిగిన భూపాల్ ను వెనక్కి సైతం వెళ్లిపోకుండా అడ్డుకొని సుమారు గంట సేపు ధర్నా నిర్వహించడంపై స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. అయినప్పటికీ స్థానిక పోలీసులు మాత్రం జరుగుతున్న తతంగాన్ని అడ్డుకోకపోవడం, ప్రేక్షక పాత్ర పోషించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. భూపాల్ నాయక్ పై వ్యతిరేక వర్గం ఎన్ని ఆరోపణలు చేస్తున్నప్పటికీ వాటిపై వారు ఎందుకు చట్టపరమైన న్యాయ పోరాటానికి ముందుకు సాగడంలేదు? భూపాల్ నాయక్ రాజకీయరంగ ప్రవేశంతో ఎవరికి నష్టం? కాంగ్రెస్ తరుపున డోర్నకల్ బరిలో నిలుస్తానన్న ఆయన ప్రకటనే ఆయనకు అడ్డంకులు సృష్టిస్తోందా? అనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. వీటన్నిటికీ సమాధానాలు వెతికితే ఆయన కాంగ్రెస్ టికెట్ ఆశిస్తూ డోర్నకల్ బరిలో నిలుస్తానని ప్రకటన చేసినప్పటినుండే ఆయనకు నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు మొదలయ్యాయనేది కాదనలేని వాస్తవం. ఇక ఆయన డోర్నకల్ కాంగ్రెస్ నుండి బరిలోకి దిగితే ఎవరికి నష్టమో వారే భూపాల్ కు వ్యతిరేక క్యాంపెయిన్లు నిర్వహిస్తున్నారని కాంగ్రెస్ లోని ఓ వర్గం తెలుపుతోంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యతిరేక ప్రదర్శనలు, ధర్నాలు, నిందారోపణలు ఎన్నైనా చేయవచ్చుగాక, కానీ ఆ చర్యలు శృతి మించి హింసాత్మక ధోరణిలో ఉండకూడదని చిన్న గూడూరులో భూపాల్ కు వ్యతిరేకంగా జరిగిన నిరసన ధర్నా రుజువు చేస్తోంది. భూపాల్ రాజకీయరంగ ప్రవేశంతో వేడెక్కిన డోర్నకల్ రాజకీయాలు సమీప భవిష్యత్ లో ఇంకెన్ని తీవ్ర ఘటనలకు దారి తీస్తాయో, వాటిని పోలీసు వ్యవస్థ ఎంతమేర కంట్రోల్ చేయగలదో వేచి చూడాలి.
Admin
Dhiviti News