దివిటీ న్యూస్ - ఎడిటోరియల్ / : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కేంద్రంగా ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయ సమీకరణాలు మారుతున్నట్లే కనిపిస్తున్నాయి. వైఎస్ షర్మిల గత కొంత కాలంగా తెలంగాణలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ (YSRTP) అనే రాజకీయ పార్టీని స్థాపించి మూడు వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తూ కేసిఆర్, కాంగ్రెస్ పార్టీలపై పెద్ద ఎత్తున విమర్శలు చేసిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే అప్పట్లో ఆమెను తెలంగాణ బిడ్డ కాదు అని ఆమె జగన్, బీజేపీ వదిలిన బాణంగా వర్ణిస్తూ రాజకీయ విమర్శలు చేశారు పలువురు రాజకీయ నేతలు. ఆ సమయంలో ఆమె ఆ విమర్శలకు వివరణ ఇస్తూ నేను తెలంగాణ కొడలినే, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయడానికే వచ్చానని బదులిస్తూ వచ్చారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా ఇటీవలే ఆమె సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లను కలవడం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేస్తుందని వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా పొలిటికల్ హీట్ మొదలైంది.
Also Read : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. గ్యాస్ సిలిండర్ 5 వేలు..- కాంగ్రెస్ నాయకులు బలరాం నాయక్ @DhivitiNews.com
ఆమె రాకను తెలంగాణలోని కొత్త నాయకుడి ఆధ్వర్యంలో నడుస్తున్న కాంగ్రెస్ వర్గం వ్యతిరేకిస్తుంటే, ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ సహచరులుగా ఉన్న పాత కాంగ్రెస్ నాయకులూ మాత్రం ఆహ్వానిస్తున్నారు. అందుకే ఆమె తెలుగు రాష్ట్రాల్లో ఏ నాయకుడి ద్వారా కాకుండా డైరెక్ట్ గా కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కేపిసిసి చీఫ్ డీకే శివ కుమార్ ద్వారా అధిష్టానంతో చర్చలు జరుపుతోంది. అయితే తెలంగాణ కాంగ్రెస్ లోని ఒక వర్గం తెలంగాణలో షర్మిల అవసరం లేదని, అసలే తెలంగాణ సెంటిమెంట్ ఎక్కువ ఉండే రాష్ట్రంలో ఆమె మూలంగా కొంత నష్టం జరిగే అవకాశాలు ఉంటాయని వారిస్తున్నారు. అయితే ఇంకో కోణం ఏంటంటే.. వైఎస్ షర్మిల తెలంగాణ కాంగ్రెస్ కేంద్రంగా రాజకీయాలు చేస్తే పాత కాంగ్రెస్ సీనియర్ నాయకులు, షర్మిల కలిసి పార్టీలో పట్టు బిగిస్తే ప్రస్తుత కొత్త కాంగ్రెస్ నాయకులకి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని గ్రహించి ఆమె రాకని రేవంత్ వర్గం వ్యతిరేకిస్తున్నట్టు వినికిడి. కాగా ఆమె కాంగ్రెస్ అధిష్టానం ముందు నేను తెలంగాణ కేంద్రంగానే రాజకీయలు చేస్తానని, పాలేరు నుండి పోటీ చేస్తానని చెప్పినట్టు సమాచారం. కానీ అధిష్టానం మాత్రం ఆమెకి కర్ణాటక నుండి రాజ్యసభ ఇచ్చి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కీలకంగా ఉండాలని, అవసరమైతే ఏపీసీసీ బాధ్యతలు ఇచ్చి రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను షర్మిల ద్వారా వాడుకొని కాంగ్రెస్ కి ఏపీలో పూర్వవైభవం తేవాలని యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్ర నుండి షర్మిలను యాక్టివ్ చేస్తే.. ఇటు జగన్ కి చెక్ పెట్టి కాంగ్రెస్ ని ఎంతో కొంత బలోపేతం చేయొచ్చునని అధిష్టానం భావిస్తోందట. ఇది పసిగట్టిన జగన్ ఢిల్లీలో ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నా మద్దతు మీకే ఇస్తా షర్మిలను ఎలక్షన్స్ తరువాతే ఏపీలో యాక్టివ్ చేయండని సూచిస్తూ పావులు కదుపుతున్నట్టు సమాచారం. దీనితో ప్రస్తుతం షర్మిల ఇష్యూ రెండు తెలుగు రాష్ట్రాలలో పలు కీలక పరిణామాలకు దారి తీసే అవకాశాలను కొట్టిపారేయలేనివిగా కనిపిస్తున్నాయి.
వ్యాసకర్త: నవీన్ రామడుగు, ఫోన్: 9666008293
Admin
Dhiviti News